వీటి పవర్ చూశాక ఎవరూ అమెరికాతో ఆటలాడుకునే సాహసం చేయరు: ట్రంప్

  • ఖరీదైన రాకెట్ల కంటే భారీ తూటాలు పేల్చే నౌకలే మేలన్న ట్రంప్
  • గతం కంటే 100 రెట్లు శక్తివంతమైన 10 యుద్ధ నౌకల నిర్మాణం
  • భారత్, పాకిస్థాన్ మధ్య విపత్తును నివారించానన్న ట్రంప్
  • వాణిజ్యం, టారిఫ్ ల అస్త్రాలతోనే ఇది సాధ్యమైందని వెల్లడి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ రక్షణ రంగానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. సైనిక సంపత్తి విషయంలోనూ తమ విధానాన్ని మార్చుకుంటున్నట్లు ఆయన తెలిపారు. దాదాపు 3 మిలియన్ డాలర్ల ఖరీదైన రాకెట్లను వాడటం కంటే.. భారీ తూటాలను ప్రయోగించే యుద్ధ నౌకలే మేలని ఆయన అభిప్రాయపడ్డారు. దీనివల్ల ఖర్చు తగ్గడంతో పాటు శత్రువుల గుండెల్లో భయం పుట్టించవచ్చని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు.

ప్రస్తుతం అమెరికా ఇలాంటి 10 భారీ యుద్ధ నౌకలను నిర్మిస్తోందని, ఇవి గతంలో కంటే 100 రెట్లు శక్తివంతమైనవని ట్రంప్ వెల్లడించారు. ఈ విధ్వంసకర నౌకలను వాడాలన్నది తమ ఉద్దేశం కాదని, కానీ ఈ శక్తి సామర్థ్యాలు చూసి ఎవరూ అమెరికాతో ఆటలాడుకునే సాహసం చేయరని స్పష్టం చేశారు. చాలా మంది తనను యుద్ధం కోరుకునే వ్యక్తిగా చిత్రీకరిస్తుంటారని, కానీ వాస్తవానికి 8 యుద్ధాలను ముగించింది తానేనని ట్రంప్ గుర్తుచేశారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధినేతల మధ్య తీవ్రమైన ద్వేషం ఉందని, వారిని చర్చలకు ఒప్పించడం చాలా కష్టమైన పని అని ట్రంప్ వ్యాఖ్యానించారు. సముద్రం అడ్డుగా ఉండటం వల్ల ఆ యుద్ధం ప్రభావం అమెరికాపై పెద్దగా ఉండదని, కేవలం యూరప్ కు మేలు చేసేందుకే తాను ఈ ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు. ఇదే సమయంలో భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలపైనా ఆయన స్పందించారు. ఆ రెండు దేశాల మధ్య పరిస్థితులు చేయిదాటిపోయేలా ఉన్నప్పుడు, తాను వాణిజ్యపరమైన సుంకాలను అస్త్రంగా ప్రయోగించి సమస్యను పరిష్కరించానని, ప్రజల ప్రాణాలను కాపాడానని ట్రంప్ పేర్కొన్నారు. ప్రజలను ఏకతాటిపైకి తీసుకురాగల సామర్థ్యం తనకుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Donald Trump
US Military
America
Warships
Russia
Ukraine
Putin
India Pakistan
Trade Tariffs
International Relations

More Telugu News